జగన్ మాయావతి, శరద్ పవార్‌తో... మంతనాలు సాగిస్తున్నాడా?

తాను అవమానకర పరిస్థితిలో నిష్ర్కమించేందుకు కారణమైన కాంగ్రెస్‌ నాయకత్వంపై వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. తాను లేని కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఎలా మనుగడ సాగిస్తుందో నాయకత్వానికి అనుభవపూర్వకంగా చాటి చెప్పనున్నారు. రాష్ట్రంలో జీవచ్ఛవంలా పడిఉన్న కాంగ్రెస్‌కు ప్రాణాలకు సైతం తెగించి జీవం పోయడమే కాకుండా, రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి సేవలను తృణప్రాయంగా పక్కకుపెట్టి, తన కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్‌ నాయకత్వానికి జాతీయ స్థాయిలోనే తిరుగులేని గుణపాఠం చెప్పాలని వైఎస్‌ జగన్‌ కృత నిశ్చయంతో ఉన్నారు.

అందుకు యుపిఏ సర్కారులోని భాగస్వామ్యపార్టీల్లో సోనియా వైఖరి పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న పెద్ద పార్టీలతో మంతనాలు జరిపి, వారిని కాంగ్రెస్‌ నుంచి వేరు చేయాలన్న వ్యూహంతో జగన్‌ ఢిల్లీపై దృష్టి పెట్టారు. ప్రధానంగా.. యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తీరుపై అసంతృప్తితో ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్‌ అధ్యక్షుడు శరద్‌పవార్‌, బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతితో మంతనాలు ప్రారంభించినట్లు జగన్‌ వర్గీయుల సమాచారం.
Pawar-32జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంతో పీకల్లోతు కష్టాలతో కూడుకుపోయిన కాంగ్రె స్‌ నాయకత్వానికి తాజాగా బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఎదురయిన ఘోర పరాభవం నైతికంగా దెబ్బతీసింది. కాబోయే ప్రధానిగా ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీ ప్రచారం చేసినా, గతంలో కంటే ఇంకా తక్కవ స్థానాలే దక్కడం నాయకత్వం అవమానంగా భావిస్తోంది. అంతర్గతంగా కూడా యుపిఏ భాగస్వామ్య పక్షాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దేశవ్యాప్తంగా తనకు మళ్లీ ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న ఆందోళనతో ఉన్న పార్టీకి తాజాగా ఆంధ్రలో జగన్‌ వ్యవహారం వజ్రాఘాతంలా పరిణమించింది.

ఈ పరిణామాలను సద్వినియోగం చేసుకుని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని జగన్‌ నిర్ణయించుకు న్నారు. అందులో భాగంగా.. ఆయన శరద్‌పవార్‌, మాయా వతితో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. తన వద్ద ఉన్న సంపదను కాంగ్రెస్‌ పతనానికి వినియోగించాలన్న భావన ఆయనలో కనిపిస్తోంది. బీఎస్‌పి, ఎన్సీపీతో పాటు కొన్ని చిన్న చితకా పార్టీలను యుపిఏకు మద్దతు ఉపసంహరింపచేసి, దాని ద్వారా వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ముందే అంతా ఒక కూటమిగా ఏర్పడి, కాంగ్రెస్‌ను చావుదెబ్బతీయాలన్నది జగన్‌ లక్ష్యమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తన తండ్రికి సన్నిహితుడయిన శరద్‌పవార్‌ సలహా కోసం జగన్‌ త్వరలో ఆయనను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ద్వారా మాయావతి, ఇతర ప్రాంతీయ పార్టీ నేతలతో చర్చలు జరపాలన్నది జగన్‌ వ్యూహమంటున్నారు. వీలుంటే అన్నాడిఎంకె అధినేత్రి జయలలితతో కూడా చర్చించాలన్నది జగన్‌ అభిమతమని చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జరిగే జగన్‌ ఢిల్లీ యాత్రలో ప్రధాన అజెండా ఇదేనని ఆయన వర్గీయులు వివరిస్తున్నారు.

0 Responses to "జగన్ మాయావతి, శరద్ పవార్‌తో... మంతనాలు సాగిస్తున్నాడా?"

Leave a Reply